Thursday, January 27, 2011

అచ్చవని నా ఆర్టికల్... బ్లాగుల్లో సాహితీ సేద్యం

పోస్టు చేయని ఉత్తరాల్లాగా ఈనాడు ఆదివారంలో అచ్చుకు నోచుకోని ఒకానొక పాత ఆర్టికల్ ఇది. 2008లో రాశాను. బ్లాగుల్లో కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలూ వెలిగపోతున్నాయన్నదే కాన్సెప్టు.
===============
కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలతోనూ బ్లాగుల్లో సాహిత్యం వెలిగిపోతోంది. కందాలూ సీసపద్యాలూ సమస్యాపూరణలూ కథలూ కవితలూ... భువనవిజయాన్ని తలపిస్తున్నాయి  తెలుగుబ్లాగులు. బ్లాగరులే అష్టదిగ్గజాలై చెలరేగిపోతున్నారు.

బ్లాగంటే... ఎవరో ఒకరి సొంతసోది. కానీ తెలుగు బ్లాగులు ఇంకో అడుగు ముందుకేశాయి. అభిప్రాయాల వెల్లడితోపాటు అవధానాలూ సాగుతున్నాయక్కడ. పద్యాలు రసగంగాప్రవాహమై పొంగుతున్నాయి. కథలూ కవితలూ పేరడీలూ ఇవన్నీ పిల్లకాలువలు!


కందాల వెల్లువ
కందం రాయనివాడు కవిగాడని సామెత. అలాగైతే బ్లాగుల్లో కవులు చాలామందే ఉన్నారు. అనగా కందాలు రాస్తున్నవారన్నమాట. సమస్యాపూరణం నుంచి... సమకాలీన విషయాల మీద తమంతట తాము స్పందించి రాసినవాటిదాకా ఎన్నెన్నో పద్యాలు. రాసేవాళ్లంతా గొప్ప అవధానులూ కారు. సామాన్యులే. చిన్నప్పటి నుంచీ పద్యం మీద ఉండే ఆసక్తీ అభిలాష, కొద్దోగొప్పో సహజ ప్రతిభ... ఇవే వారి సాహితీ సేద్యానికి పెట్టుబడులు. విశేషమేంటంటే ఇలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ క్రమంగా పద్యాలు రాయడంలో పట్టు సాదఇంచడం. పద్యం నడకను పట్టుకుని అలవోకగా కందాలల్లే స్థాయికి చేరుకోవడం. మధ్యలో ఎక్కడైనా నట్టుపడితే ఆదుకోవడానికి బ్లాగ్గురువులు అందుబాటులోనే ఉంటారు. రోజువారీ అందరూ వాడే, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత సులభంగా పద్యాలు రాయొచ్చో ఆ కిటుకు విడమరిచి చెబుతారు. కొత్తవారు రాసిన పద్యాలకు మరికొన్ని విరుపులతో సరికొత్త సొగసులద్దుతారు. మొత్తమ్మీద పసందైన పద్యాలు ఊపిరి పోసుకుంటాయి. రాదురాదంటూనే ఔత్సాహిక కవులు ఉద్దండులవుతారు. కావాలంటే... ‘తెలుగులో తప్పటడుగులు’ అంటూనే పద్యాల గొప్పటడుగులు వేస్తున్న లంకాగిరిధర్ అనే ప్రవాసాంధ్రుడి బ్లాగు చూడొచ్చు. ‘పై చదువులకని కొన్నాళ్లూ ఉద్యోగరీత్యా కొన్నాళ్లూ మొత్తానికొ పదేళ్లపైగానే ఇంటికి దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్లతో తప్ప తెలుగులో సంభాషఇంచే అవకాఅం లేక... తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోతున్న దళలో నాలో స్వభాషఆభిమానానికి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులకే చెందుతుంది. వారికి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు’ అంటారాయన.

నెట్లో భువన విజయం
అవును... భువనవిజయమే! అంతర్జాలంలోనే! తెలుగు బ్లాగరుల్లో పద్యాల మీద ఆసక్తి ఆ స్థాయికి చేరింది మరి. పొద్దు అనే వెబ్ జైన్ ‘అంతర్జాల భువన విజయం’ పేరుతో సాహితీసేద్యానికి శ్రీకారం చుట్టింది. సమస్యల ఏరువాక... చమత్కార వ్యాఖ్యానాల ఎరువు జల్లడం... పూరణల పంట... అన్నీ ఒక్కరోజులోనే! 


అదీ ఏడాదిలో రెండుసార్లు. మొదటి భువన విజయం తెలుగువారి తొలిపండుగ ఉగాదినాడు జరగ్గా రెండోది ఇటీవలే విజయదశమినాడు జరిగింది. అప్పటిదాకా ఎవరిబ్లాగుల్లో వారుపద్యాలు రాసుకోవబడమే రివాజు. అలాంటిది పదిపదిహేను మంది బ్లాగర్లు ఇంటర్ నెట్ లో ఒకచోట కూడి తమ ప్రతిభను ప్రదర్శించడం అపూర్వం. మరే ప్రాంతీయ బ్లాగర్లూ ఇలాంటి ప్రయత్నం చేయలేదేమో బహుశా!

ఎందరో సాహితీప్రియులు
వాగ్విలాసం చిరునామాగా చెలరేగుతున్న శ్రీరాఘవ, ‘ఆంధ్రామృతం’ చిలికిస్తున్న చింతా రామకృష్ణారావు, అరుదైన పద్యాల ‘తెలుగు పద్యం’తో సాహితీప్రియులకు విందు చేసే భైరవభట్ల కామేశ్వరరావు, ‘అందం’గా కందాల్లే రాకేశ్వరుడు (కందపద్యాలకో ‘ఇమేజీ’నిచ్చారీయన), తాను రాస్తూ సమస్యలిచ్చి పూరించమనే ఊకదంపుడు(పేరడీ శ్లేషలకు పెట్టింది పేరు. ఈయన మాటల్లో అక్షరానికో చమత్కారబాణం)... కుస్తీ పట్టి యతిప్రాసలూ గణనియమాలూ కూడగట్టుకుంటూ కందప్రాశన చేసి ఓ వెలుగు వెలిగిపోతున్న చదువరి, రానారె లాంటి శిష్యులూ ఇంకా కొత్తపాళీ, కలగూరగంప, జోరుగాహుషారుగా, సిరివెన్నెల... ఇలా ఎందరో బ్లాగర్లు... కాదుకాదు సాహితీప్రియులున్నారు అంతర్జాలంలో.


పద్యాలపూరణే కాదు, కథాపూరణలూ జరుగుతున్నాయి నెట్లో. ఉదాహరణకు... కొత్తపాళీ అనే బ్లాగరు ‘తెల్లకాగితం’ అనేఅంశాన్నిచ్చి దాని మీద కథ రాయాల్సిందిగా సూచించారు. ఆసక్తి ఉన్న అనేకమంది ఈ కథాపూరణ ప్రక్రియలో పాల్గొన్నారు. వాటిని పొద్దు వారు ప్రచురించడం మరో ముచ్చట. 

ఆ కథల్లోనూ కవితల్లోనూ పద్యాల్లోనూ నాణ్యత సరైనదేనా... అన్న సందేహం వస్తే మాత్రం... ‘ఇంతమంది ఔత్సాహికుల, అలవాటు లేని వారు సైతం ఆసక్తితో ఈ పాటి ప్రయత్నం చేయడమే గొప్పవిషయం కదా’ అని సమాధానం వస్తుంది బ్లాగర్ల నుంచి.


నిజమే, తప్పుల్దేముంది, తర్వాతైనా సరిదిద్దుకోవచ్చు. ప్రయత్నమే ముఖ్యం, ఏమంటారు!
==================


అద్గదీ కథ!
కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ వ్యాసం ప్రచురణకు నోచుకోలేదు. నిన్న జరిపిన క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా నా డెస్కులో అట్టడుగున ఎక్కడో కంట పడిందీ రెండేళ్లనాటి కాపీ. ఒక టపాకైనా మేత దొరికిందిగదాని అక్కడ చదివి ఇక్కడ నెమరేస్తున్నా. 
ఇక్కడ నా అనుకోలు ఇంకోటుంది. ఇదంతా రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు బ్లాగుల్లో చాలా మార్పులొచ్చేశాయి.
ఏంటా మార్పులంటారా... మంది ఎక్కువైపోయారు(నాతో సహా :) )

Sunday, January 23, 2011

గాజులమ్మేసి రైలెక్కా

ఈవీవీ సత్యనారాయణ... బూతుకామెడీకి పెట్టింది పేరు. ద్వంద్వార్థ సంభాషణలకు కేరాఫ్ అడ్రస్...
ఇదీ మీ సినిమాలపైనా మీమీదా చాలామందికి ఉన్న అభిప్రాయం. దీనికి మీరేమంటారు?

చిన్నప్పుడు మేం ఏ సినిమా చూసినా హాల్లోంచి బయటికొచ్చేటప్పుడు ‘...గాడు ఏం చేశాడ్రా, లం... కొడుకు’అనే కామెంట్లు వినిపించేవి. ఆ సందర్భంలో అది తిట్టు కాదు. ఒక హీరోమీద లేదా నటుడిమీద సాధారణ ప్రేక్షకుడు తన అభిమానాన్ని ఆ ఒక్క మాటలో చెప్పే విధానం.  బాగా పాలిష్డ్;,,గా మాట్లాడేవాళ్ల సంగతి నాకు మద్రాసుకొచ్చేదాకా తెలీదు. మనసులో ఏమున్నా అలా బయటికి మాట్లాడే మనుషుల్ని చూస్తూ పెరిగాను. అందుకే నా సినిమాల్లో పాత్రలు అలాగే మాట్లాడతాయి, ప్రవర్తిస్తాయి. నా టార్గెట్ కూడా ఆ ప్రేక్షకులే.
...అని కచ్చితంగా చెప్పారాయన. కనీసం ఆయనకు ఆ క్లారిటీ ఉన్నందుకైనా ఫరవాలేదనిపించింది నాకు.  2009లో ఈవీవీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈవీవీ సినిమాలు అలా ఉంటాయని తెలిసీ వెళ్లి, చూసి ఎంజాయ్ చేసిన సవాలక్ష మందిలో నేనూ ఒకణ్ని. ఆయన శ్రుతి మరీ మించినప్పుడు(ఉదాహరణకు ‘అల్లుడా మజాకా’. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి) తిట్టుకున్న సవాలక్ష మందిలోనూ నేనొకణ్ని.  ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అవకాశాన్ని వదులుకోకుండా... ‘అల్లుడా మజాకా’లో అత్తగారిని పట్టుకునే సీన్ గురించి కూడా అడిగాను. ఆయన ఏదో సమర్థించుకున్నాడుగానీ... ఆయన ఇంటెన్షన్ మాత్రం సూటిగా జనాలకు చేరిందన్నది వాస్తవం.
    సరే, ఇవాళేదో ఈవీవీ చనిపోయాడని ఆయన్ని బి.ఎన్.రెడ్డి సరసనో కె.వి.రెడ్డి సరసనో కూర్చోబెట్టంగానీ... కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదంటూ ఒక ప్రత్యేక పేజీ ఉంది.
అది ఈవీవీ స్కూల్. 
    ఇక్కడితో నా సోది ఆపేస్తాను. ఇక ఆ ఇంటర్వ్యూ విశేషాలు చదవండి.

=====================
తేదీ గుర్తులేదుకానీ... చెన్నైలో నేను అడుగు పెటి్టన మొదటి రోజది. సెంట్రల్ స్టేషన్లో దిగాను. జోరున వర్షం కురుస్తోంది. నేను వెళ్లాల్సింది టి నగర్. ఎక్కడో తెలీదు. ఎలా వెళ్లాలో తెలీదు. పోనీ, ఎవరినైనా అడుగుదామా అంటే భాష రాదు. అలాగే నానా తిప్పలూ పడుతూ లేస్తూ నడుచుకుంటూనే టి నగర్ చేరుకున్నాను. పొద్దున ఆరింటికి స్టేషన్ దగ్గర బయల్దేరితే అక్కడికి చేరేసరికి పదకొండంయింది. అది... నవతా కృష్ణం రాజుగారి ఆఫీసు.
*        *        *
వానలో తడిసి నీళ్లోడుతున్న బట్టలతోనే ఆయన్ను కలిసి ‘నా పేరు సత్యమండీ, కోరుమామిడి నుంచొచ్చాను. మీ మేనల్లుడు సుబ్బరాజు స్నేహితుణ్నండీ’ అని పరిచయం చేసుకుంటూనే మా సుబ్బరాజు రాసిన ఉత్తరం ఆయన చేతికిచ్చాను.
    ఏం మాట్లాడకుండా నేనిచ్చిన ఉత్తరం తీసుకుని చదివి... అప్పుడడిగారాయన. ‘ఏమైనా తిన్నావా’ అని. తిన్లేదంటే ఇడ్లీలు తెప్పించి పెట్టారు. అవి తినేదాకా ఆగి... ‘ఏంచేస్తావు’ అన్నారు.
‘ఏమైనా చేస్తానండీ’ అన్నాను.
‘మీరేదో అనుకుని వచ్చేస్తారుగానీ... ఇక్కడేం ఉండదమ్మా, మీ ఊరెళ్లిపో’ అన్నారాయన.
నా నెత్తిన పిడుగుపడ్డట్టయింది.
వ్యవసాయంలో అప్పులపాలై బతకి చెడ్డ కుటుంబం మాది, ఇంటికి పెద్ద కొడుకుని. పోషించాల్సిన బాధ్యత నాదే. అన్నిటికీ మించి... మా ఆవిడ గాజులమ్మేసి మరీ చెన్నపట్నం వచ్చాను. అవన్నీ ఆలోచించుకుంటూ అక్కడే నుంచున్నాను. మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ఆయన భోజనానికెళ్తూ నన్ను చూశారు. మళ్లీ అదే మాట చెప్పి వెళ్లిపోయారు. ఆయన భోజనం నుంచి వచ్చేదాకా అక్కడే నుంచున్నా. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిదింటప్పుడు ఆయన బయటికొచ్చేటప్పటికి కూడా చేతులు కట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాను.
కొంచెం విసుక్కుని ‘ఇప్పుడెక్కడికి వెళ్తావులే, ఇక్కడే ఉండు. కానీ పొద్దున్నే వెళ్లిపోవాలి’ అని భోజనం పెట్టించి అక్కడే పడుకోమన్నారు. నేను మర్నాడు పొద్దునా వెళ్లలేదు.
ఇహ మా మధ్య మాటల్లేవు. రోజూ ఆయనొచ్చే సమయానికి చేతులు కట్టుకుని అక్కడ నిలబడేవాణ్ని. రెండ్రోజులు, మూడ్రోజులు.... అలా పదిరోజులు గడిచాయి!!
ఆయనకు నా మీద జాలేసినట్టుంది. ఒకరోజు పిలిచి ‘వచ్చేనెల మా సినిమా ఒకటి మొదలవబోతోంది. అందులో అసిస్టెంట్ డైరెక్టరుగా చేద్దువుగానివిలే. అప్పటిదాకా ఇంటికెళ్లిరా’ అన్నారు.
కొండంత బరువు నెత్తిమీది నుంచి దింపినట్టయింది.
హుషారుగా ఇంటికి బయల్దేరాను.

*        *        *
నెలరోజుల తర్వాత మళ్లీ చెన్నై వెళ్లాను. కృష్ణంరాజుగారి సినిమాకి దేవదాస్ కనకాల దర్శకుడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. ఆ సినిమా పేరు ‘ఓ ఇంటి భాగోతం’. హీరో చంద్రమోహన్. మొదటి సారి సినిమా నటుల్ని చూడ్డం కదా... ఏదో తెలియని ఆనందం. చంద్రమోహన్తో ఫొటోలు దిగి ఇంటికి పంపించడం, ఎడిటింగ్ రూములో కిందపడి ఉండే నెగెటివులు తీసుకుని కవర్లో పెట్టి స్నేహితులకు పోస్టు చేయడం లాంటి పనులు చేసేవాణ్ని. ఇప్పడవన్నీ తల్చుకుంటుంటే నాకే నవ్వొస్తుంది.
    ఆ సినిమా షూటింగ్ సమయంలో నా పనితీరు నచ్చడంతో దేవదాస్ కనకాల తాను తర్వాత తీయబోయే సినిమాలకు కూడా నన్నే సహాయకుడిగా పెట్టుకుంటానన్నారు. అన్నట్టుగానే తర్వాత మూడు సినిమాలు తీశారు. అవి మూడూ ఫ్లాపవడంతో చెన్నై వదిలేసి హైదరాబాదుకి వెళ్లిపోయారు.
    మళ్లీ మొదటికి వచ్చినట్టయింది నా పరిస్థితి. ఆయన కాకుండా ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తి నవతా కృష్ణంరాజుగారే. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లాను. అదృష్టవశాత్తూ మరోనెలలో వాళ్లు జంధ్యాలతో ఒక సినిమా మొదలుపెడుతున్నారని తెలిసింది. ‘ఆయన దగ్గర చేరుదువుగానిలే’ అని భరోసా ఇచ్చారు కృష్ణంరాజుగారు.
    ఆ సినిమా... ‘నాలుగు స్తంభాలాట’.
    జంధ్యాలగారి దగ్గర అప్పటికే నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ బలవంతమ్మీద నన్ను అయిదో వాడిగా తీసుకున్నారు. యూనిట్లో అందరూ కూడా నన్ను మొదట్లో హీనంగా చూసేవారు. ఇక ఆ అసిస్టెంట్ దర్శకుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. కానీ... రానురానూ జంధ్యాలకు నేను కుడిభుజాన్ని అయిపోయాను. షూటింగ్ ముగిసేసరికి జంధ్యాలగారే తనంతటతాను ‘నువ్వు నా దగ్గర ఉండిపో’ అన్నారు. ఆ తర్వాత వరసపెట్టి సినిమాలు.
    నాలుగుస్తంభాలాటతో మొదలుపెట్టి అహ నా పెళ్లంట దాకా 23 సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాను.

*        *        *
ఇవాళ ఎన్ని అడుగులు(ఫిలిం) ఎక్స్ పోజ్ చేశారు... రేపు షూటింగ్ ఎక్కడ... ఆర్టిస్టులెవరు...
రామానాయుడుగారు షూటింగ్కి వచ్చినప్పుడల్లా ఇలా అడగటం అలవాటు. అదే అలవాటుతో ‘అహ నా పెళ్లంట’షూటింగ్ సమయంలో ఆయన అడిగే ప్రశ్నలన్నిటికీ నేను తడుముకోకుండా, డైరీ చూడకుండా టకాటకా సమాధానాలు చెపే్పసేవాణ్ని. అదాయన మనసులో రిజిస్టరయింది.
    ఆ సినిమా విడుదలై హిట్టయ్యాక ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్తే... ‘జంధ్యాల దగ్గర ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు’ అనడిగారు.
    ‘ఏడెనిమిదేళ్ల నుంచి’ అని చెప్పాను.
    ‘ఎన్నాళ్లిలా ఉండిపోతావు, డైరెక్షన్ చెయ్యవా’ అనడిగారాయన. ‘అవకాశం వస్తే చేస్తానండీ’ అన్నాను. ‘అయితే మంచి కథ తయారుచేసుకో, నీకు ఛాన్సిస్తాను’అన్నారాయన.
    కథ రెడిగా ఉందండీ, అని అప్పటికే నేను తయారుచేసుకున్న ‘చెవిలో పువ్వు’ కథ తీసుకెళ్లి ఆయనకు చూపించాను. నేను రాసుకున్న మొదటిస్క్రిప్టు కదా... రంగురంగుల స్కెచ్చు పెన్నులతో చాలా అందంగా తయారుచేసుకున్నానా స్క్రిప్టుని.
    ఆ కథ నాయుడుగారికి బాగా నచ్చింది. ‘బావుందయ్యా కథ, మనం చేద్దాం ఈ సినిమా’ అన్నారు.
ఆ మాటకి నేను ఆల్మోస్ట్ మబ్బుల్లో ఎగిరాను. పదేళ్ల కల అది... డైరెక్టర్ కావడం! కానీ....
    నాలుగైదు రోజుల తర్వాత నాయుడుగారు నాకు ఫోన్ చేసి... ‘కమల్ హాసన్ డేట్లు దొరికాయయ్యా, కాబట్టి ముందు ఆ సినిమా చేసి, తర్వాత నీ కథ చేద్దాం’ అన్నారు. అంటే ఎంత లేదన్నా నా ప్రాజెక్టు ఐదార్నెల్లు ఆలస్యమవుతుంది. సరేనన్నాను.
    మళ్లీ రెండ్రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేసి... ‘కమల్,కి ఓ కో-డైరెక్టర్ కావాలంటయ్యా, నీకు స్క్రిప్టు బాగా రాసే అలవాటుందిగా, నువ్వు రాకూడదూ’ అనడిగారు. ఎగ్గిరి గంతేసినంత పనిచేశాను. నేను కమల్ హాసన్ కి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందనేసరికి ఆనందం పట్టలేకపోయాను.  మర్నాడే వెళ్లి కమల్ని కలిశాను. ఆయన ఇంట్లోనో ఆఫీసులోనో రోజూ స్టోరీ సిట్టింగ్స్ పెట్టేవాళ్లం. నా కెరీర్లో మొదటిసారి ఆ సినిమాకి సంభాషణలు రాశాను. నేను రాసే డైలాగులు ఆయనకు విపరీతంగా నచ్చేవి.
    ఆ సినిమాలో కమల్ హాసన్ తాగి ఇంటికొచ్చి తలుపుకొట్టే సీనొకటుంది. కమలే వచ్చి రెండుసార్లు తలుపుకొట్టి, తనే ‘కమిన్’ అనేటట్టుగా ఆ సీన్ రాశాను. పగలబడి నవ్వారాయన ఆ సీన్ చెప్తే. అదేకాదు, ఆ సినిమాలో నే రాసిన చాలా సీన్లు తల్చుకుని తల్చుకుని నవ్వేవారాయన. అలా ఆ సినిమాకి పదకొండు నెలలు కమల్ హాసన్తో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం.
    సరే, మళ్లీ నా విషయానికి వస్తే... ‘ఇంద్రుడు-చంద్రుడు’సినిమా విడుదలడమూ హిట్టవడమూ జరిగిపోయాయి. ఇక నా సినిమా మొదలెడతారేమో అనుకున్న టైములో నాయుడుగారికి అనిల్ కపూర్ డేట్లు దొరికాయి. దాంతో ఏదో హిందీ సినిమా మొదలుపెట్టారాయన. నా సినిమా మరో ఏడాది వాయిదా పడింది. అప్పుడు నిర్మాత అశోక్ కుమార్,కి నా స్క్రిప్టు గురించి తెలిసి ఆ సినిమా తాను తీస్తానన్నారు. తానే నాయుడుగార్ని సంప్రదించి అందుకు ఒప్పించారు. అలా అశోక్ కుమార్ నిర్మాతగా నా తొలిసినిమా ‘చెవిలో పువ్వు’ మొదలైంది.
     ఆ సినిమా షూటింగుకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. షెడ్యూలు మధ్యలో సీత పార్తీబన్ ని వివాహం చేసుకోవడం వల్ల మాకిచ్చిన డేట్లలో అందుబాటులో లేకుండా పోయింది. షూటింగ్ ప్రణాళిక ప్రకారం జరక్కపోవడంతో మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లు సర్దుబాటు కష్టమయింది. దీంతో తక్కువ సమయంలోనే హడావుడి హడావుడిగా తీసేయడంతో సినిమా కంగాళీగా తీసేశాం. సినిమా విడుదలకు ముందురోజు రాత్రికి గానీ రషెస్ చూడ్డం కుదర్లేదు నాకు. కానీ... రషెస్ చూడగానే అర్థమైపోయిందినాకు ఆ సినిమా ఫలితమేంటో!

*        *        *
మొదటి సినిమా ఫ్లాపయినా నాకు తన బ్యానర్లో దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు రామానాయుడుగారు. ఎందుకంటే ‘చెవిలోపువ్వు’ సినిమా ఎంత హడావుడిగా తీశామో ఆయనకు తెలుసు. ఆయనకు నామీద పూర్తి నమ్మకం ఉండటంతో మరో ఆలోచన లేకుండా ఛాన్సిచ్చారు. కాకపోతే ఈసారి నా స్క్రిప్టు కాకుండా పరుచూరి బ్రదర్స్ రాసిన ఒక సినిమా స్క్రిప్టు నా చేతికిచ్చి చదవమన్నారు. అది నాకు పెద్దగా నచ్చలేదు. ఆ మాటే చెప్పాను.
    ‘నాకూ అలాగే అనిపించింది, నువ్వూరాస్తావుగా... ఎలా ఉంటే బాగుంటుందో రాసి చూపించు’ అన్నారు. దాదాపు నెలరోజులలో 18 వెర్షన్లు రాశానా సినిమాకి. చివరిది పరుచూరి బ్రదర్స్ కి నచ్చడంతో షూటింగ్ మొదలుపెట్టాం.
    నాకో అలవాటుంది... స్క్రిప్టులో ఉన్నదానికి అవసరాన్ని బట్టీ షూటింగులో కాస్తంత మార్పుచేర్పులు చేస్తుంటాను. అలా సినిమా 90 శాతం పూర్తయ్యేసరికి స్క్రిప్టులో వాళ్లు రాసినదానికీ నేను తీసినదానికీ సంబంధం లేకుండా పోయింది. రషెస్ చూసిన పరుచూరి బ్రదర్స్ నామీద మండిపడ్డారు. సినిమాని నాశనం చేసేశానని రామానాయుడుగారికి చెప్పారు.
    దాంతో రామానాయుడికి బాగా కోపం వచ్చింది. పరుచూరి బ్రదర్స్ అంతటి వాళ్లు బాగాలేదన్నారంటే నిజమేనేమో అనుకుని రషెస్ చూసి నిర్ధరించుకోకుండానే, నన్ను బాగా తిట్టారు. ఆ బాధతో ఆయన ఆఫీసు బయట కూర్చున్నాను. అంతలో...  దర్శకులు మురళీమోహనరావు, బి.గోపాల్ నాయుడిగారి ఆఫీసుకి వచ్చారు. నా ముఖంచూసి... ‘ఏంజరిగింది’ అని అడిగారు. విషయం చెప్పాను. ‘నువ్వేం బాధపడకు’ అని లోపలికి వెళ్లారు వాళ్లు. ఆయన తనగోడు వాళ్ల దగ్గర వెళ్లబోసుకుని ‘మీరొకసారి రషెస్ చూసి ఏవైనా మార్పులూ చేర్పులూ చేయండి’అన్నారట. వాళ్లు ప్రివ్యూ చూసొచ్చి... ‘సినిమా బ్రహ్మాండంగా ఉంది, కామెడీ అదిరిపోయింది’ అని చెప్పారు. దాంతో రామానాయుడు ఒకసారి ఆలోచించుకున్నారు. తనుకూడా రషెస్ చూశారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. నా దగ్గరకు వచ్చి ‘నీకు ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తున్నానయ్యా, క్లైమాక్స్ నీ ఇష్టప్రకారమే తియ్యి’ అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు.

*        *        *
జంధ్యాల కామెడీ సినిమాలే కాదు, ఆనందభైరవి సత్యాగ్రహం లాంటి విభిన్నమైన సినిమాలూ చేశారు. కానీ ఆయన మీద కామెడీ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. అలాగే రేలంగి నరసిహారావుగారికి కూడా. ఆ ముద్ర నా మీద పడకూడదనే సెంటిమెంట్, యాక్షన్, కామెడీ... ఇలా అన్నిరకాల సినిమాలూ తీస్తూ వచ్చాను. నా కుటుంబం నిలబడాలి, దర్శకుడిగా నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే కసితో పదిపదిహేనేళ్లపాటు కుటుంబాన్ని పట్టించుకోకుండా సినిమాలు తీశాను.
    రాజేష్ నరేష్ చేతికందిరావడంతో ఇదుగో గత ఐదేళ్లుగా రిలాక్స్ డ్;,గా ఉన్నాను. ఇంకో ఐదారేళ్లు ఇలాగే ఇంకొన్ని సినిమాలు తీసి ఆ పై విశ్రాంత జీవితం గడిపేస్తా.

================
...ఐదారేళ్లు సినిమాలు తీస్తానన్న ఈవీవీ కత్తి కాంతారావు సినిమా తర్వాత మరో సినిమా తీయకుండానే చనిపోయారు. May his soul rest in peace.

Thursday, January 6, 2011

మినప సున్నుండలూ బుద్ధిమాంద్యమూ!

విజయవాడ నుంచీ వస్తూవస్తూ మా అత్తగారు మినపసున్నుండలు తెచ్చారని కిందటి పోస్టులో చెప్పా కదా. ఇది దానికి కొనసాగింపన్నమాట.

ఆవిడ సున్నుండలు బయటికి తీయగానే ‘అత్తయ్యా నువ్వవి ఎందుకు తెచ్చావో నాకు తెలుసులే’ అన్నాను. ‘ఎందుకు’ అందావిడ మొహం వెలిగిపోతుండగా (నేనేదో ఆవిడ ప్రేమనూ ఆప్యాయతనూ ఆత్మీయతనూ అనుబంధాన్నీ గుర్తించానని ఫీలైపోయింది పాపం).

మన పాండిత్యం అంతా ఒలకబోసే ఛాన్సొచ్చిందిరా అనుకునేసి ‘అసలికి అత్తగార్లు అల్లుళ్లకీ మినప సున్నుండలు ఎందుకు పెడతారో తెలుసా, దానెనక రెండు ప్రయోజనాలున్నాయంట’అని పే...ద్ద హరికథాభాగవతారులా ఆ కథ చెప్పటాకి తయారయ్యాను.
(ఇక్కడోపాలి గొంతు సవిరించుకున్న సౌండేసుకోండి)

సంసృత కవి శ్రీహర్షుడు తెలుసుగా, ఆయన రాజుగారి కోరికమీద ‘నైషధం’ అనే కావ్యం రాసినాడంట. ఆ కావ్యం ఫస్టుకాపీ హర్షుడి తల్లి మామల్లదేవి చదివిందట. మహామహా పండితులకే అర్థంగానట్టు కొరకరాని కొయ్యలా ఉందా కావ్యం. ఆవిడ కూడా మంచి విదుషీమణి. ఆ కావ్యం అట్టానే రాజుకినిపించినాడంటే కొడుక్కి పేరు రాదనుకుని ‘ఒరే నాయనా, చదివేకి బాగా కష్టంగా ఉందిది, మళ్లోసారి రాయి నాయనా’ అందట. తల్లిమాట మీద మళ్లీ మొదట్నుంచీ మొదలుబెట్టి రెండోసారి రాసేశాడట హర్షుడు.

మొదటిదాని మీద ఆ రెండో కాపీ సుమారుగానే ఉన్నా అదీ ఓ మాదిరి కష్టంగానే ఉండటంతో ఇట్ట లాబం లేదన్జెప్పి హర్షుడికి రోజూ మినుములు తినబెట్టడానికి పూనుకుందటా మహాతల్లి. ఇడ్డెన్లూ(ఇవి అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కొంత సొంత పైత్యం కలిపేస్తున్నా), గారెలూ, దిబ్బరొట్టెలూ మినప సున్నుండలూ... ఈ రకంగా ముప్పొద్దులా మినుముల వంటకాలే.

ఆర్నెల్ల తర్వాత...
ఒకరోజు హర్షుడు వంటింట్లో కూర్చుని మినపరొట్టి తింటుండగా ఆయన మేనమామ వచ్చి ‘కిమశ్నాసి’(అంటే... ‘ఏం తింటున్నావోయ్’ అని కాబోలు) అని అడిగాడట.

దానికి హర్షుడు... ‘అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా’ అని సమాధానం చెప్పాడట.
(ఇదెప్పుడో చిన్నప్పుడు మా నాన్న చెప్పిన చమక్కు. నా కోడిబుర్రకు అర్థమైనంతవరకూ... ‘నా సమస్త బుద్ధినీ తస్కరించే మినుములు(తో తయారుచేసిన రొట్టి) తింటున్నాను ఆర్యా’ అనిదీనర్థం. ఒకవేళ తప్పైతే, సరైన అర్థం పెద్దలు తాలబాసుగారో ఊకదంపుడుగారో చింతారామకృష్ణారావుగారో నేను పేర్లు మరచిన మిగతా పెద్దలో చెప్పాలి).

హర్షుడి సమాధానం ఆ పక్కనే రొట్లు కాలుస్తున్న మామల్లదేవి విన్నది. వినగానే ఆవిడ ముఖం చింకి చాటంత అయ్యిందట. కొడుకు తను అనుకున్న స్టాండర్డుకి వచ్చేసినాడని అర్థం చేసుకుని ‘అబ్బాయ్, ఇంక మళ్లీ మొదలెట్టు నీ నైషధం’ అందట.

భక్తులారా... ఆవిదంగా...
హర్షుడు మూడోపాలి రాసిన నైషధమే మనమిప్పుడు అందరం చెప్పుకొంటోన్న నలదమయంతుల కథ అనే అద్భుత కావ్యం. దీన్నే శ్రీనాథుడు ‘శృంగార నైషధం’గా తెలుగులో రాసేశాడు.

ఈ కథంతా చెప్పుకొచ్చి... మినుములు తిని అల్లుళ్ల బుద్ధి కాస్తంత మందగించితే కూతురు కొంగు పట్టుకు తిరుగుతాడు కదా, అందుకేనమ్మా అల్లుళ్లకు అత్తగార్లు మినప సున్నుండలు బెట్టేదీ.... అని వెటకారం వెలగబెట్టా.

ఆ దెబ్బతో ఆవిడ మొహం చూడాలి. ‘చీ పాపాత్ముడా, పోన్లే తింటావుగదాని ప్రేమగా సున్నుండలు తెస్తే, ఎంత కత చెప్పినావురా... పైగా నా మీద ఇంత అభాండం వేస్తావా’ అన్నట్టుందా చూపు.

మనమేదో పాండిత్యం వొలకబోద్దామనుకుంటే పరిస్థితి తేడాగా మారిపోయిందని అర్థమైపోయి ‘డామిట్, కథ అడ్డం తిరిగింది’ అనుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వేసి పక్కికి తప్పుకొన్నా.

అంతే ఆవిడ ఇక్కడున్న నాల్రోజులూ మినపసున్నుండల వాసన కూడా నాకు చూపించలా.
నాలుగోరోజు నేనే ఇట్లయితే లాభం లేదన్జెప్పి ఆవిడ సీరియస్సుగా ‘మొగిలిరేకులు’పదొందల డబ్బైమూడో భాగమో పదారొందల తొంబైనాలుగో భాగమో చూస్తుండగా...

‘అత్తయ్యా, సున్నుండలు తెచ్చానంటివే... ఒక్కటి గూడా పెట్టలేదే’ అనడిగా

‘ఏమోలే, తెచ్చానంటేనే అంత కత చెప్పావ్, పెడితే ఇంకేమంటావో అని పెట్టలా’ అని ఓ సన్నాయినొక్కు నొక్కింది.
(ఉట్టిపుణ్యానికి ఆవిడ సహనాన్ని పరీక్షించడానికి అలా అడిగానే గానీ, తెచ్చినరోజు రాత్రే మా హోంమినిస్టరు నాకా సున్నుండలు రహస్యంగా స్మగ్లింగు చేసేసింది. ఈ రహస్యం మా అత్తగారికి చెప్పకండెవరూ. ఏమాటకామాటే... సున్నుండలు సూపరో సూపరు).

ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అడగనే లేదు : )