Thursday, March 31, 2011

దిగులేస్తోంది

ఎందుకో ఈ మధ్య దిగులేస్తోంది.
మొన్న రమణగారు... నిన్న నూతన్ ప్రసాద్...
మనకున్న కొద్దిమంది ప్రతిభావంతులు ఇలా ఒకరొకరుగా వెళ్లిపోతున్నారంటే మనసులో ఎక్కడో ఏదో తెలియని బాధ. ఎందుకో నిన్న నూతన్ ప్రసాద్ మరణవార్త వినగానే ‘రాజాధిరాజు’ సినిమా చూడాలనిపించింది. బాపు తీసిన ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ సైతాను పాత్రలో అద్భుతంగా నటించాడు.
మనుషుల మనస్తత్వాల్లో కల్తీని ఎండగట్టేసిన రవణగారి మాటల్ని నూతన్ ప్రసాద్ గొంతులో వింటుంటే....
వినడమెందుకు, మీరే చూడండి.

నామిని... నెంబర్ వన్ పుడింగి

చూడబోతే ఇది కన్ఫెషన్ తరహా రచనల సీజన్లా ఉంది. మొన్నమొన్నే ఈ తరహాలో వర్మ రాసిన ’నా ఇష్టం‘ చదివాం. ఇప్పుడా పనికి నామిని వొగదెగినాడు.
‘నామిని నెంబర్ వన్ పుడింగి’ అంటూ కొత్తపుస్తకం రాసి జనాలమీదికి వొదిలాడు.

మొన్న శనివారం నాడు ఎడిషన్ డెడ్ లైన్ బిజీలో ఉండగా సాయంత్రం నాలుగింటప్పుడు మందపాటి పార్శిల్ వచ్చింది. రోజూ పుస్తక సమీక్షల కోసం అలాటి పార్శిళ్లు రావడం సహజమే కాబట్టి పెద్దగా పట్టించుకోలా. కొద్దిసేపటి తర్వాత బాయ్ వచ్చి ఒక పుస్తకం నా ముందు పెట్టి వెళ్లాడు. చూద్దును కదా... అది నామిని కొత్త పుస్తకం.

సిమెంటుకలర్ అట్టమీద బొమ్మ ఏమీ లేకుండా కింద టైటిల్ మాత్రం ఉంది.
అసలే చిన్నప్పటి నుంచి నామిని వీరాభిమానినేమో... ఆత్రంగా పేజీలు తెరిచి చూశాను.

మొత్తం ఎనిమిది అధ్యాయాలు.
1. మా దెయ్యాల బాట పక్కన్నే ఐద్రాబాదు!
2. ఆంధ్రజ్యోతిలో నా తోకాటలూ, జూటాతనాలూ!
3. నక్కతోక తొక్కిన మా టామ్ సాయర్ బుక్స్
4. ఏనుగు పడింది, ఏనుగే పైకి లేచింది!
5. రియల్ ఎస్టేట్ లో కూడా శోబన్బాబు కంటే, చెడ్డతనంలో వర్మా కంటే నాలుగాకులెక్కువే!
6. నారప్ప కొడుకు సుబ్రహ్మణ్యం గాకుండా నామిని ఎట్టయినాడంటే...!
7. పదిలచ్చల కోసరం నేను తలొంచింది దీనికీ..!
8. పది కుయ్యోమొర్రోలు!

గబగబా మొదలుబెట్టి ముందు మూడో అధ్యాయం చదివేశాను (ఎందుకు మూడో అధ్యాయమే చదివానంటే... ఏమో, నాకే తెలీదు). నవోదయ రామ్మోహనరావుగారి మానం తీసి మాకులకి కట్టేశాడు నామిని ఆ అధ్యాయంలో. అఫ్ కోర్స్ నవోదయా రామ్మోహనరావుగారితో ఆయనకైన అనుభవం అటువంటిదిలెండి. రచయిత్రి సోమరాజు సుశీల భర్త తనను ఎన్ని బండబూతులు తిట్టిందీ నిస్సిగ్గుగా రాసేసుకున్నాడు.
ఇట్ట మధ్యలోంచి చదివితే లాభం లేదురా అన్జెప్పి మొదట్నుంచీ మొదలుపెట్టాను. జ్యోతి వీక్లీ సంపాదకుడుగా ఉన్నప్పుడు తానెన్ని దొంగబిల్లులు పెట్టిందీ... జ్యోతి అప్పటి అధినేత జగదీష్ ప్రసాదుని ఎంత మోసం చేసిందీ లెక్కల్తో సహా రాసేశాడు. పుస్తక ప్రచురణలో తనకెన్ని లాభాలు వచ్చిందీ రాశాడు. తాగుడు ఎలా అలవాటైందీ ఎంతగా తాగి తలపోసుకుందీ రాశాడు.

వాట్ నాట్! అవన్నీచదువుతుంటే నామిని ఇంత జూటానా అనిపిస్తుంది.
నామినే రాసిన ‘సినబ్బ కతలు’లో ‘గుడిమల్లమోడి బూందీ దగ్గర నా చాతుర్రిం’ అనే కథొకటి ఉంది. అందులో గుడిమల్లమోడనే వాడి దగ్గర బూందీ ఉందన్న విషయం పసిగట్టి వాడికిష్టమైన హీరో నాగేశ్వరరావును పొగిడి, ఉత్తపుణ్యానికి ఎన్టీఆర్ని తిట్టి మొత్తం బూందీ కాజేస్తాడు నామిని. (నామిని పుస్తకాలు చదివినవాళ్లందరికీ ఈ కథ గుర్తుండే ఉంటుంది). అందులో చిన్నతనంలో ఉండే అమాయకత్వం నవ్విస్తుంది.
అదే మనస్తత్వం పెద్దయ్యాక కూడా ఉందంటే... అదీ మనకిష్టమైన రచయితలో..! ఎందుకో కాసేపు నమ్మబుద్ధి కాలేదు.

మూడో అధ్యాయం చదవగానే ఆయనకు ఫోన్ చేసి ‘ఇవన్నీ నిజమేనా సా’అని అడిగితే నిజమేనన్నాడాయన. ఎందుకిలా రాశారంటే ‘కన్ఫెషన్’ తరహా రచన అన్నారు.
కన్ఫెషన్ అంటే ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తకంలోలాగా చేసిన పనికి పశ్చాత్తాప పడాలి. నామిని రచనలో అలాంటిదేది కనపడలేదు.
నాకైతే నచ్చలేదు.
కానీ నామిని శైలి మాత్రం మొదట్నుంచీ చివరి దాకా లాక్కెళ్లిపోతుంది.

మచ్చుకి కావాలంటే కిందటి సోమవారం నాడు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురించిన ఆరో అధ్యాయమిది, చదివి చూడండి.


*                       *                       *
ఇహ పోతే, ఈ నెల్లో మనకి అరుదైన పుస్తకాలు చదివే యోగమేదో బలంగా ఉన్నట్టుంది. పదమూడో తారీకునాడు మా పుట్టింటికి(విజయవాడ) వెళ్లినప్పుడు కాలవగట్టు వెంబడి పుస్తకాల షాపుల్లో తిరిగితే నాలుగు బౌండ్ల పాత చందమామలు దొరికాయి. 1981 నుంచి 90 దాకా ప్రచురితమైన పుస్తకాలున్నాయి. వరసలో కాకపోయినా నలభై పాత చందమామలు దొరకడమంటే మాటలు కాదుగా, మహాప్రసాదం అనుకుని తెచ్చేసుకున్నాను. ఆల్రెడీ మూడు బౌండ్లు చదివేశాను. ఇంకో బౌండు చదవాల్సి ఉంది.
అలాగే, సచిన్ టెండూల్కర్ మీద గౌతమ్ భట్టాచార్య రాసిన ‘సచ్’ పుస్కం ఫ్లిప్ కార్టులో తెప్పించాను. శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ఆన్లైనులో బుక్ చేస్తే శనివారం సాయంత్రం నాలుగింటికల్లా చేతికి వచ్చేసింది. ఇటు సచ్ పుస్తకం చేతిలో పడగానే, అటు నామిని పుస్తకం చేతికొచ్చింది. ముందు ఏది చదవాలో అర్థం కాలేదు. తెలుగు కాబట్టి, సులభగ్రాహ్యం కాబట్టి నామిని పుస్తకమే మొదలుపెట్టి ఆరోజు రాత్రి ఒంటిగంటకల్లా పూర్తిచేసేశా. సచ్ పుస్తకం కూడా సగం అయింది. మిగతా సగం చదవాల్సి ఉంది.